వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. బుధవారం ఆమెమీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరాళ్లను తయారు చేసే సంస్థకు విజయసాయి రెడ్డి ఛైర్మన్గా ఉన్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి బ్యాంకులనే కొల్లగొట్టాలని చూశారని అన్నారు. వైఎస్ వల్లే విజయసాయి రెడ్డి ఓరియంటల్ బ్యాంక్కు డైరెక్టర్ అయ్యారని అన్నారు.
13 కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు ధర్మరాజులా మాట్లాడుతున్నారని విమర్శించారు. విజయసాయి రెడ్డి బెయిల్ను రద్దు చేసి జైల్లో కూర్చొబెట్టాలని అనురాధ డిమాండ్ చేశారు. మొన్నటి వరకు ఈసీని పొగిడి.. ఇప్పుడు ఈవీఎంలు హ్యాక్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు దగ్గర పని చేసిన ఐఏఎస్లు ఐక్య రాజ్యసమితి వరకు వెళ్లారని, వైఎస్ హయాంలో పని చేసి ఐఏఎస్లు చంచల్గూడ జైలుకు వెళ్లారని విమర్శించారు.