ఏపీ రాజధాని అమరావతి పై త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో కొత్త చర్చకు దారి తీశాయి. రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు మారుస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
‘జగన్ గారూ… చిన్నప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. 1328లో రాజధానిని ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని దౌలతాబాద్ కు మార్చారు. తిరిగి అక్కడి నుంచి ఢిల్లీకి మార్చారు. ఆ తుగ్లక్ లా మీరు చరిత్ర పుటల్లోకి ఎక్కకూడదని కోరుకుంటున్నా’ అని కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు తుగ్లక్ ఫొటోను కూడా షేర్ చేశారు.