మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించటం బాధాకరమని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల తరపున రాజధానిపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడుతామని స్పష్టం చేశారు బిల్లులు ఆమోదం పొందినంత మాత్రాన వైసీపీ ప్రభుత్వం సాధించేదేమీ లేదని అన్నారు.
జగన్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపి ఇప్పుడు మాట తప్పడం జగన్ మోసకారితనానికి నిదర్శనమని మండిపడ్డారు.నాయకుడికి మాట మీద నిలబడే తత్వం, నైతిక విలువలు ముఖ్యమని… కానీ జగన్లో అవి ఏ కోశాన కూడా లేవు అనేది రాష్ట్ర ప్రజలకు మరోసారి బహిర్గతమైందని ఆయన తెలిపారు.
అన్నం పెట్టడం చేతకాక అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల పొట్టకొట్టిన జగన్ 3 రాజధానులు ఎలా కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిపై దుష్ర్పచారం చేసి ఇప్పటికే ఏడాదిన్నర కాలం వృధా చేశారన్నారు. ఇక మిగిలిన మూడున్నరేళ్ల కాలం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప మూడు బిల్డింగులు కూడా కట్టలేరని దుయ్యబట్టారు.