వాహనాల అక్రమ కొనుగోలు కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాను సీఎం జగన్ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.
జైలులో కూడా తనపై కక్ష సాధింపు తీరుతోనే వ్యవహరించారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తనకు ఆహారం కూడా ఇవ్వకుండా జైలు అధికారులపై ఒత్తిడి చేశారని ఆయన తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో తనపై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ప్రశ్నించాలని ఆయన అన్నారు.