ఏపీ సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. కక్షపూరితంగా పరిపాలిస్తూ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు తగ్గించారని, భారీగా పెన్షన్ ఖాతాలు తొలగించారని ఆరోపించారు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారన్నారు.
ఇప్పుడు విద్యుత్ చార్జీలను కూడా పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలపై అన్ని రకాల దాడులు పూర్తవడంతో ఇప్పుడు అధికారులపై పడ్డారని వ్యాఖ్యానించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా ఎలా చెడగొడుతుందో, ఏపీలో జగన్ కు అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్రం పరిస్థితి అలాగే తయారైందని విమర్శించారు.