ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని, వారితోనే మమ్మల్ని తిట్టిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నరని దుయ్యబట్టారు. తమ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెట్టి వేధించి లొంగదీసుకునేందుకు యత్నిస్తున్నారని అన్నారు. జగన్ స్క్రిప్ట్ నే వైసీపీలో చేరిన టీడీపీ నేతలు చదువుతున్నారని చెప్పారు. జగన్ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోందని చెప్పారు.
పదవులకు రాజీనామా చేసి వచ్చిన వారినే వైసీపీలో చేర్చుకుంటామని చెప్పిన జగన్… వల్లభనేని వంశీ వ్యవహారంపై ఏం సమాధానం చెబుతారని దేవినేని ఉమ ప్రశ్నించారు. జగన్ జైలుకు వెళ్తాడనే నమ్మకంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని… అందుకే తమ పార్టీ నేతలను జగన్ చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సిమెంట్ కంపెనీల వద్ద రూ. 1000 కోట్ల ముడుపులు పుచ్చుకుని… రూ. 2,500 కోట్ల బేరసారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. దీన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఉండకూడదనే కుట్రలు చేస్తున్నారని అన్నారు.