తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్ ను ప్రయోగించారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాబు నివాసం వద్ద ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని తాము అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. తాము జలవనరుల శాఖ అధికారులమని సదరు వ్యక్తులు చెప్పినా అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలను వారు చూపలేదు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత దేవినేని అవినాష్, టీడీ జనార్ధన్ తో పాటు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చేశారు. వీరిని పోలీసులు చంద్రబాబు ఇంటి లోనికి అనుమతించలేదు. దీంతో పోలీసులు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే పోలీస్ జీపు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.