కృష్ణా నది వరదముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుఈ రోజు పర్యటించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రజలను కలుసుకున్నారు. కరకట్ట వెంట ప్రజలను పలకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన ఇంటిని ముంచేందుకు ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. అయితే తన ఇల్లు మునగలేదు కానీ.. పేదల ఇళ్లను ముంచారని ధ్వజమెత్తారు.
ఓవైపు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వారిని పట్టించుకోకుండా తన ఇంటి చుట్టే తిరుగుతున్నారని నిప్పులుచెరిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని ఆరోపించారు. బాధితులకు కనీసం భోజన సదుపాయం కూడా కల్పించలేదని ప్రభుత్వ తీరుపై నిప్పులుచెరిగారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ నిర్మించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరదసహాయ చర్యలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టలేదని విమర్శించారు. వరదనీటి నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.