రాజధాని నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే అమరావతికి వచ్చానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ఐదారు గొప్ప నగరాల్లో ఒక నగరంగా అమరావతిని తయారు చేయాలని భావించానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలతో రాజధాని అమరావతి పూర్తిగా దెబ్బతిందని నాయుడు విమర్శించారు.
రాజధాని ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం అని అన్నారు. నాడు తాను ఇచ్చిన పిలుపు మేరకు రైతులు తమపై నమ్మకంతో భూములు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతిలో ఏం జరిగిందో బయట ప్రపంచానికి చెప్పడానికి వచ్చానని అన్నారు. రైతులు చేసిన త్యాగానికి ఫలితం లేకుండా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు.