ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేతల అరెస్టు సంస్కృతి లేదని టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విజయనగరంలో ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల్లో అరెస్టులు జరిగాయా? అంటూ ప్రశ్నించారు. శ్రీనగర్ పరిస్థితిని ఏపీలోకి తీసుకురావడం అన్యాయమని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర లేపిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టును ఆపి విశాఖకు నీరు తెస్తాననడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసుకుని వెళ్లాలన్నారు. అందరినీ రోడ్డున పడేసే ప్రయత్నాలు మంచిదికాదని సీఎం జగన్ కు ఆయన హితవు పలికారు.