తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ఏపీకి తాచుపాముల్లా తయారయ్యారని తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ షర్మిల పోలీసులకు చేసిన ఫిర్యాదుపై ఆమె స్పందించారు. పింఛన్ల పెంపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే వైఎస్ షర్మిల అనే బాణాన్ని వదిలారని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కేసీఆర్ బీసీలకు ద్రోహం చేస్తున్న విషయం తలసానికి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ చెంతకు చేరిన జగన్, తలసాని బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. జగన్ వదిలిన బాణం తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే ఏపీకి వచ్చి తలసాని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అనురాధ అన్నారు. ఏపీ లో బీసీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుని తలసాని ఏం ముఖం పెట్టుకుని బీసీల ద్రోహి అంటున్నారని ఆమె ప్రశ్నించారు.