ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. ఈ ఉదయం పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆర్థికమంత్రి బగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టగానే టీడీపీ, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, రూల్ నంబర్ 71 కింద నోటీసులు ఇచ్చింది. బిల్లును ప్రవేశపెట్టేముందు తామిచ్చిన నోటీసుపై చర్చించాలని టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ఆమోదం పొందినందున వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరపాల్సిందేనని, రూల్ 71 పేరు చెప్పి, బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని బుగ్గన స్పష్టం చేశారు. దీనిపై నిబంధనలను పరిశీలించిన మండలి చైర్మన్, రూల్ 71ను పరిగణనలోకి తీసుకుని టీడీపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుని, చర్చకు అనుమతిచ్చారు. దీంతో మండలిలో ఈ బిల్లుకు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఒకవేళ ఇక్కడ బిల్లు వీగిపోతే, డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద అధికార పక్షం, దీన్ని ఆమోదింపజేసుకునే వీలుంటుంది.