రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసుల నమోదు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గడచిన ఆరు వారాల్లోనే 28 మంది ఈ వైరస్ బారిన పడ్డారంటే ప్ల్యూ స్వైరవిహారం ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1325 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో 21 మందిని మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఒక్క హైదరాబాద్లోనే 680 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. అందులో ఏడుగురు ఈ వైరస్ బారినపడి చనిపోయారు.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా స్వైన్ ఫ్లూ ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగు రాష్రాల్లో భారీ వర్షాల కారణంగా వాతావరణంలో జరిగిన మార్పుల ప్రభావం వైరస్ విజృంభనకు కారణం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజుకు సుమారు 60మంది వరకు నమూనాలను పరీక్షిస్తుండగా సగటున 16శాతం కేసులు నమోదు అవుతున్నాయి.దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణ వైరల్ లక్షణాలు, స్వైన్ ఫ్లూ లక్షణాలు దగ్గర దగ్గరగా ఉండడంతో ఆసుపత్రులకు బాధితులు పరగులు తీస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ తరహా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చలికాలంలో స్వైన్ ఫ్లూ వైరస్ బాగా వృద్ధి చెందే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.