కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా, ఆసక్తిని ఉపకరణంగా వినియోగించుకొని సమాజంలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని మార్చేసే ఆలోచనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తుంటాయి. ప్రస్తుతం ప్రపంచ కప్ క్రికెట్ ఫీవర్ కొనసాగుతోంది… పాన్ షాపు, చాయ్బండీ.. ఇలా ఎక్కడ నలుగురు కలిసినా క్రికెట్ ముచ్చట్లే కొనసాగుతున్నాయి. పోటీలో గెలుపెవరిదనే ఆసక్తి అందరిలోనూ కొనసాగుతోంది. ఈ క్రికెట్ ఫీవర్ను స్వచ్ఛ హైదరాబాద్ – కీప్ హైదరాబాద్ క్లీన్ పేరుతో క్విక్ మింట్ సంస్థ ఓ వినూత్న పోటీని నిర్వహిస్తోంది.
అందులో భాగంగా పాన్షాపుల వద్ద సిగరెట్ తాగేవారు సిగరెట్ తాగిన అనంతరం సిగరెట్ పీకలను ఇష్టానుసారంగా రోడ్లపై వేయకుండా క్విక్ మింట్ సంస్థ ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలని సూచిస్తోంది. డబ్బాపై స్వచ్ఛత సందేశంలో పాటు ఒకవైపు భారత్, మరోవైపు ఇంగ్లాడ్ జట్టులు ఈ ప్రపంచ కప్ క్రికెట్లో హాట్ఫెవరేట్గా చూపుతూ ఎవరు గెలుస్తారని భావిస్తోరో.. వారి వైపు డబ్బాలో సిగరెట్ పీక వేయాలని సూచిస్తున్నారు. ఇలాంటి ప్రచార డబ్బా ఇప్పుడు శ్రీనగర్కాలనీలోని మమత పాన్షాప్ వద్ద అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే కొందరు భారత్ హాట్ఫెవరేట్ అంటూ వారి తాగిన సిగరెట్ పీకను భారత్ వైపు డబ్బాలో వేస్తున్నారు.