నటుడు సూర్య చిత్రాలతోనే కాదు, తన సహజత్వంతోనూ అందరిని ఆకట్టుకుంటారు, అటువంటి వ్యక్తిత్వం ఉన్న వాడిగా ఆయనకు మంచి పేరే ఉంది. అటు తమిళ, ఇటు తెలుగు సినిమా ప్రపంచంలో ఆయనకు అభిమానులు కోకొల్లలు. తాజాగా, తాను నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి కావడంతో తమిళ నటుడు సూర్య చిత్ర యూనిట్ సభ్యులు 120 మందికి బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు. దీంతో యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఆయన సిబ్బందికి కానుకలిచ్చాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య, రకుల్ప్రీత్ సింగ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో ‘ఎన్జీకే’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సూర్య కానుకలు పంచిపెట్టాడు. దర్శకుడు సెల్వరాఘవన్ ఓ ట్వీట్లో చిత్ర యూనిట్కు ధన్యవాదాలు తెలిపాడు. సూర్య అంకితభావం, ప్రతిభ చూసి ఆశ్చర్యపోయినట్టు పేర్కొన్నాడు. ఆయనతో ప్రయాణం అద్భుతంగా ఉందన్నాడు. కాగా, కోలీవుడ్లో సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లు, సిబ్బందికి కానుకలివ్వడం కొత్తకాదు, గతంలో అజిత్, విజయ్, ధనుష్ వంటివారు కూడా ఇలా కానుకలు పంచిపెట్టారు.