సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం ఆమె బీజేపీ మద్దతును కూడగట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా- శుక్రవారం ఉదయం ఆమె బెంగళూరులో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ఎం కృష్ణతో భేటీ అయ్యారు. తాను పోటీ చేయడం ఖాయమైందని, స్వతంత్ర అభ్యర్థిగా లేదా బీజేపీ తరఫున అనేది తాను ఈ నెల 18వ తేదీన ప్రకటిస్తానని సుమలత వెల్లడించారు. మండ్య లోక్ సభ స్థానం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. సుమలతకు భారతీయ జనతాపార్టీ మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మండ్య స్థానంలో అభ్యర్థిని నిలబెట్టకూడదని బీజేపీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మండ్య లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ.. జేడీఎస్ కోసం వదులుకున్నట్టే తెలుస్తుంది. ఆ స్థానంలో జేడీఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, జాగ్వార్ హీరో నిఖిల్ కుమార్ గౌడ పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని కుమారస్వామి అధికారికంగా వెల్లడించారు కూడా. దీనితో సుమలత అవకాశాలకు తెర పడినట్టయింది. నిజానికి- మండ్య స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయిస్తే, సుమలతకే ఆ పార్టీ తరఫున అవకాశాలు ఉండేవి. తనకు గట్టిపట్టు ఉన్న మండ్యను కాంగ్రెస్ కు ధారాదాత్తం చేయడానికి జేడీఎస్ అంగీకరించలేదు. గెలుపు అవకాశాలు వందశాతం ఉన్నట్టుగా భావిస్తోన్న ఆ స్థానంలో తన కుమారుడిని నిలబెట్టాడు కుమారస్వామి.