క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. లాక్డౌన్ సమయంలో విడుదల చేసిన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను రెండింతలు చేసింది. ‘పుష్ప’ను పాన్-ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు సుకుమార్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘పుష్ప’ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. పోలాండ్కు చెందిన సినిమాటోగ్రాఫర్ మిరోస్తావ్ క్యూబా బ్రోజెక్ ఈ సినిమాకు కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్గా నటించనున్నారని, ఎర్రచందనం దుంగలను తరలించే లారీ డ్రైవర్గా ఆయన కనిపిస్తారని ఇప్పటికే ప్రచారం జరిగింది. ఎర్రచందనం స్మగ్లింగ్కు సంబంధించిన సన్నివేశాలన్నీ దట్టమైన అడవుల్లో చిత్రీకరించాలి. కాబట్టి, మొదట చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో షూటింగ్ చేయాలని నిర్ణయించారు. కానీ, అటవీశాఖ నుంచి నుమతులు లభించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. తరవాత కేరళ అడవుల్లో ‘పుష్ప’ చిత్రీకరణ జరుపుతారని అన్నారు. అయితే తాజాగా సుకుమార్ లొకేషన్స్ను ఫైనల్ చేశారని, త్వరలోనే సినిమా సెట్స్పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి సమీపంలో ఉన్న మారేడుమిల్లి అడవుల్లో ‘పుష్ప’ షూటింగ్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అక్కడ దాదాపు నెలరోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారట. మారేడుమిల్లిలో ఒక రిసార్ట్ను కూడా నెల రోజులకు బుక్ చేశారని టాక్. అల్లు అర్జున్తో పాటు రష్మిక మందన కూడా ఆ రిసార్ట్స్లోనే ఉండనున్నారని సమాచారం. రాజమండ్రి సిటీలో కన్నా అక్కడికి దూరంగా ఉండే రిసార్ట్స్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని సుకుమార్ భావించారట. అలాగే, నిబంధనల ప్రకారం షూటింగ్లో పాల్గొనే వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.
previous post