ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్టాల్లో తెలుగు టివి ఛానల్స్ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు కేబుల్ ఆపరేటర్ల సంఘం తెలిపింది. వచ్చే నెల నుంచి ఛానల్స్ ను నిలిపివేస్తున్నట్లు లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్సీఓ), మల్టీపుల్ సిస్టమ్ ఆపరేటర్ల సంఘం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం వల్ల కేబుల్ ఆపరేటర్లతో పాటు సామాన్య ప్రజలపై పెను భారం పడుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు.
ట్రాయ్ నిబంధనల పై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్లో సమావేశమయ్యారు. కొత్త విధానం ప్రకారం ప్రేక్షకులు తమకు కావాల్సిన ఛానెల్ను ఎంచుకుని దానిని కొనుక్కోవాలన్నారు. ఇతర ఛానెల్స్తో పోలిస్తే తెలుగు ఛానెల్స్ ఎక్కువ ధర చెబుతున్నాయని వారు తెలిపారు. ట్రాయ్ కొత్త నిబంధనల కారణంగా ప్రేక్షకులపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40 కే అందిస్తున్నారని అయితే ట్రాయ్ నిబంధనల కారణంగా పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నాయని తెలిపారు.