అమెరికా ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో అణు పరీక్షలు నిర్వహించిన మార్షల్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో రేడియోధార్మికత స్థాయి చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. రష్యాలోని చెర్నోబిల్, జపాన్లోని ఫుకుషిమాలో అణు ప్రమాదాలతో నష్టపోయిన ప్రాంతాల కన్నా అక్కడ ఈ ముప్పు ఎక్కువగా ఉందని వెల్లడైంది. మార్షల్ దీవులపై అమెరికాలోని కొలంబియా వర్సిటీ మూడు అధ్యయనాలు నిర్వహించింది.
కొన్ని దీవుల్లో అణు ఐసోటోపుల గాఢత పరిమితికి మించి ఉందని వెల్లడైంది. అమెరికా, మార్షల్ దీవుల మధ్య కుదిరిన ఒప్పందాలకు ఇది విరుద్ధమని పరిశోధకులు పేర్కొన్నారు. 1946 నుంచి 1958 మధ్య అమెరికా దాదాపు 70 అణు బాంబులను ఈ దీవుల వద్ద పరీక్షించింది. అందులో అతిపెద్ద విస్ఫోటం ‘క్యాజిల్ బ్రావో’ను బికినీ అటోల్ వద్ద నిర్వహించారు. జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై ప్రయోగించిన అణుబాంబుల కన్నా అది వెయ్యిరెట్లు శక్తిమంతమైనది కావటం విశేషం.