మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు ఇంజినీర్ల చర్య పట్ల శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్(ఎస్ఆర్ఎస్పీ) ఇంజినీర్లు ఘాటుగా స్పందించారు. గడిచిన శనివారం నాడు ఎటువంటి హెచ్చరికలు, సమాచారం లేకుండానే అధికారులు బాబ్లీ నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని విడుదల చేశారు. ఊహించని విధంగా ఒక్కసారిగా ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద ప్రవాహం పోటెత్తడంతో ఇంజినీర్లు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహంపై మధ్యాహ్నం 3 గంటల తర్వాత బాబ్లీ నుంచి ఎస్ఆర్ఎస్పీకి ఏ విధమైన సమాచారం రాలేదు. దీంతో 6.30 గంటలకు అధికారులు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు.
కానీ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు రాత్రి 9.30 గంటలకు నీటి విడుదలకు మరోమారు మరోమారు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సైతం వ్యాప్తి చెందింది. దీంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గల పలు ప్రాంతాలు నీటి ముంపుకు గురయ్యాయి. స్పందించిన ఎస్ఆర్ఎస్పీ అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. కాగా బాబ్లీ ప్రాజెక్టు ఇంజినీర్ల నిర్లక్ష్యంపై ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ జీ. శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.