బెంగళూరు అసెంబ్లీ స్పీకర్ రమేశ్కుమార్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కన్నడలోని సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముంబయిలో ఉన్న 10 మంది కాంగ్రెస్ -జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు ఆదేశాలతో గురువారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారంతా కలిసి రమేశ్కుమార్కు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. ”ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలపై ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నానన్న వార్తలు నన్ను బాధించాయి. గవర్నర్ నాకు ఆరో తేదీన సమాచారం ఇచ్చారు. జులై 6న మధ్యాహ్నం 1.30 వరకు నా ఛాంబర్లోనే ఉన్నా.
ఆ రోజు ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2గంటలకు వచ్చారు. ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చారు. అంతకముందు నన్ను కలుస్తానని ఏ ఎమ్మెల్యే చెప్పలేదు. ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిసి కార్యాలయం నుంచి వెళ్లిపోయానన్న మాట అవాస్తవం. సోమవారం రోజున 202 రూల్ కింద ఎమ్మెల్యేల రాజీనామాలు పరిశీలించా. కర్ణాటక అసెంబ్లీ విధానాల ప్రకారం రాజీనామాలు స్వచ్ఛందంగా, సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తాం. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం నా బాధ్యత. గతంలో ఇచ్చిన వాటిలో 8 రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్లో లేవు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోను” అని స్పీకర్ స్పష్టంచేశారు.