telugu navyamedia
సినిమా వార్తలు

‘మేయర్‌’గా పోటీ చేయనున్న సోనూసూద్‌?

కరోనా కష్టకాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని వేగవంతంగా పరిష్కరించి ‘రియల్‌’హీరోగా నిలిచాడు ఈ రీల్‌ విలన్. కరోనా ఫస్ట్‌వేవ్‌ లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్‌ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు. ఎన్నో సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తోన్న ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

2022లో నిర్వహించనున్న బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బి.ఎం.సి) ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సోనూసూద్‌ పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కాంగ్రెస్‌ ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు సెలబ్రిటీలని ఎంపిక చేసుకుందని, ఆ జాబితాలో సోనూతోపాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్, మోడల్, ఫిట్‌నెస్ పర్సనాలిటీ మిలింద్ సోమన్ నిలిచారని టాక్‌ వినిపించింది.

త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. తాజాగా సోనూసూద్‌ ఈ విషయంపై స్పందించారు. ఈ వార్తలు అవాస్తమని తెలిపారు. ‘ఈ వార్తల్లో నిజం లేదు. సాధారణ వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను’ అంటూ స్పష్టత ఇచ్చారు. సోషల్‌ మీడియాలో కొందరు నెటిజన్లు, ఆయన అభిమానులు సోనూసూద్‌ని రాజకీయాల్లోకి రావాలని కోరుతుండగా మరికొందరు వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts