telugu navyamedia
సినిమా వార్తలు

నైజిరియన్ చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్

Sonakshi-Varma

టాలీవుడ్ యువ హీరోయిన్ సోనాక్షి వర్మ ఓ నైజీరియన్ దగ్గర దారుణంగా మోసపోయింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ నైజీరియన్ ఆమె నుంచి రూ.85 వేలు లాగేసుకున్నాడు. మెర్రిన్ కిర్రాక్ పేరుతో ఇటీవల తన ఫేస్‌బుక్‌ ఖాతాకు వచ్చిన మెసేజ్ చూసిన సోనాక్షి స్పందించడమే పాపమైంది. ఆ తర్వాతి నుంచి మెర్రిన్ నుంచి తరచూ పోస్టులు వస్తుండేవి. సోనాక్షి తన వలలో చిక్కుకుందని గ్రహించిన మెర్రిన్ తన వ్యక్తిగత వివరాలను పోస్టు చేశాడు. తాను లండన్‌లో ఉంటున్నానని, తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని పేర్కొన్నాడు. అక్కడితో ఆగక మన స్నేహానికి గుర్తుగా ఓ గిఫ్ట్‌ను పంపిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా అది ఇంటికే వస్తుందని చెప్పుకొచ్చాడు. అనుకున్నట్టే గత నెల 27న ఢిల్లీ విమానాశ్రయ అధికారుల పేరుతో సోనాక్షికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మెర్రిన్ కిర్రాక్ నుంచి బహుమతి వచ్చిందని, అందులో వేలాది డాలర్లు ఉన్నాయని నమ్మబలికాడు. ఈ గిఫ్ట్ బాక్స్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపేందుకు రూ.85 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. నిజమేనని నమ్మిన సోనాక్షి అతడు చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.85 వేలు జమచేసింది. డబ్బు జమచేసి రోజులు గడుస్తున్నా గిఫ్ట్ రాకపోవడంతో గతంలో తనకు ఫోన్ చేసిన అధికారికి కాల్ చేయగా ఫోన్ పనిచేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన సోనాక్షి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts