భారత క్రికెటర్ శిఖర్ధావన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తోంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనకు అతను సిద్ధంగా ఉన్నాడని సమాచారం. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం వెస్టిండీస్ టూర్కు జట్టుని ప్రకటించే నేపథ్యంలో అతడికి స్థానం లభించే అవకాశముంది. ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో గబ్బర్ చేతివేలికి గాయమైన విషయం తెలిసిందే. ప్యాట్కమిన్స్ బౌలింగ్లో గాయపడిన అతడు నొప్పిని ఓదార్చుకొని మరీ శతకం(117; 109 బంతుల్లో) బాదాడు.
ఆ మ్యాచ్ లో టీమిండియా 36 పరుగులతో విజయం సాధించింది. గాయం తీవ్రత కారణంగా ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో అతడు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. శిఖర్ధావన్ స్థానంలో ఓపెనింగ్ బాధ్యతలు స్వీకరించిన కేఎల్ రాహుల్ నిలకడగా ఆడి ఆకట్టుకున్నాడు. న్యజిలాండ్తో సెమీఫైనల్ మినహాయించి రోహిత్శర్మతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఒకవేళ గబ్బర్ జట్టులో చేరితే రాహుల్ మళ్లీ నాలుగో స్థానానికి వెళ్లే అవకాశముంది.