ఎన్నికల సంఘం, కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధుపై చర్యలు తీసుకుంది. మూడు రోజులపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. బీహార్లోని కటిహార్లో గతవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సిద్ధు మాట్లాడుతూ.. ముస్లింలు ఓట్లు చీల్చవద్దని కోరారు. ‘‘నేను ముస్లిం సోదరులకు ఒక విషయం చెప్పదలిచాను. అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలను ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని విభజించాలని చూస్తున్నారు. కొత్త పార్టీ పెట్టి మిమ్మల్ని విడగొట్టి, విజయం సాధించాలని చూస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ఇక్కడ ముస్లిం జనాభా 65 శాతం ఉందని, అందరూ ఐక్యంగా ఉండడం వల్ల మైనారిటీలు కాస్తా మెజారిటీగా ఉండొచ్చని పేర్కొన్నారు. అదే జరిగితే పరిస్థిల్లో మార్పు వస్తుందని, మోదీ ఓటమి పాలవుతారని సిద్ధు అన్నారు. సిద్ధు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మాట్లాడారంటూ ఈ నెల 16న ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. పరిశీలించిన ఈసీ సిద్ధు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. 72 గంటలపాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించింది.