ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో “భారతీయుడు-2” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా ఈరోజే ఈ చిత్రం తొలి షెడ్యూల్ చెన్నైలో జరగనుంది. ఈ శింబు ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నాడని ఇదివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కమల్ హాసన్ కు మనవడిగా శింబు కన్పించబోతున్నాడని, గతంలో వచ్చిన “భారతీయుడు” సినిమాలో కమల్ సేనాపతిగా, ఆయన కొడుకు చంద్రబోస్ గా ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడు సేనాపతికి మనవడిగా శింబు కన్పించబోతున్నాడని అన్నారు. అయితే ఇప్పుడు శింబు స్థానంలో సిధార్థను తీసుకున్నారని తెలుస్తోంది. శింబుకు డేట్స్ సమస్య రావడంతో ఆ పాత్ర తెలుగు, తమిళ, హిందీలో క్రేజ్ ఉన్న నటుడు సిద్ధార్థను వరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో అజయ్ దేవగన్ స్థానంలో అక్షయ్ కుమార్ ఎంపికయ్యారు. ఇక స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.