కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళూరు నేత్రావతి నదీ తీరంలో సిద్ధార్థ మృతదేహం లభించింది. ఈ క్రమంలో ఆ నదిలోకి దూకి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుల పాలై ఆత్మహత్య కు పాల్పడ్డారన్న వాదన కూడా వినిపిస్తుంది. కానీ ఆయన పేర్కొన్న అప్పుల కంటే ఆస్తుల విలువే ఎక్కువని స్థానిక మీడియా చెప్పుకొచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చలేని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం సిద్ధార్థకు ఎందుకొచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది
సిద్ధార్థ కనిపించకుండాపోయిన తర్వాత ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు రాసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ లేఖ సిద్ధార్థ 27వ తేదీనే రాసినట్టుగా ఉంది. సిద్ధార్థ 29వ తేదీ సాయంత్రం నుంచి అదృశ్యమయ్యారు. ఆ రెండు రోజుల్లో బయటకు రాని లేఖ ఆయన కనిపించకుండా పోయిన తర్వాతే ఎలా ప్రచారంలోకి వచ్చిందన్న సందేహం వ్యక్తమవుతోంది. ఆ లేఖపై తనకు అనుమానాలున్నాయని, అది రాసింది సిద్ధార్థనో కాదో తేలాలంటే విచారణ జరపాలని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా డిమాండ్ చేశారు. మంగళూరు వెళ్లాలని భావించిన సిద్ధార్థ ఆ బ్రిడ్జి దగ్గరే దిగి ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు భావించారనేది తెలియాల్సి ఉంది. సిద్ధార్థ మృతిపై పోలీసులు దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశముంది.
నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్