కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, నిత్యం బాధపడుతూనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, పూర్తికాలం తమ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు.
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. తాను బయటకు ముఖ్యమంత్రినే కానీ నిత్యం బాధను భరిస్తూనే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు చెప్పారు. అందుకు కారణాన్ని మాత్రం తాను చెప్పలేనంటూ కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.