హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక తుది ఫలితం మరికాసేపట్లో వెలువడనుంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం ఖాయమైంది. మొత్తం 22 రౌండ్లకు గానూ ఇప్పటివరకు 12 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి.
టీఆర్ఎస్ పార్టీకి 11వ రౌండ్లో 21,618, 12వ రౌండ్లో 23,821 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు టీఆర్ఎస్ పార్టీని అందుకోలేకపోతున్నాయి. కారు దూకుడుకు మిగతా పార్టీలు చతికిలపడిపోయాయి. శానంపూడి సైదిరెడ్డికి తొలి రౌండ్లో టీఆర్ఎస్ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా, రెండో రౌండ్లోనూ 4 వేల మెజార్టీతో, మూడో రౌండ్లో 6,777, నాలుగో రౌండ్లో 9,356, ఐదో రౌండ్లో 11 వేలు, ఆరో రౌండ్లో 12,356, ఏడో రౌండ్లో 14,300, ఎనిమిదో రౌండ్లో 17,400, తొమ్మిదో రౌండ్లో 19,200, పదో రౌండ్లో టీఆర్ఎస్కు 20 వేల ఓట్ల మెజార్టీ వచ్చింది.