అడవి శేష్, శివానీ హీరోహీరోయిన్లుగా వెంకట్రెడ్డి దర్శకత్వంలో `2స్టేట్స్` సినిమాను నిర్మాత ఎంఎల్వీ సత్యనారాయణ ప్రారంభించారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన “2స్టేట్స్” నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయిపోయింది. ఇలాంటి తరుణంలో నిర్మాత, దర్శకుడి మధ్య విభేదాల కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ నటిస్తున్న తొలి సినిమా “2 స్టేట్స్” ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. దర్శకుడిగా వెంకట్ రెడ్డిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో నిర్మాత సత్యనారాయణపై దర్శకుడు వెంకట్ రెడ్డి కోర్టులో కేసు వేశారు.
తాజాగా దర్శకుడు వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “వీవీ వినాయక్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన నేను “2స్టేట్స్” సినిమాతో దర్శకుడిగా మారుతున్నాను. సినిమా ప్రారంభించడానికి ముందే హీరో, హీరోయిన్, నిర్మాత, ఇతర సాంకేతిక నిపుణులకు కథ పూర్తిగా చెప్పాను. ఇప్పటికి దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్ విషయంలో నిర్మాతతోపాటు మా టీమ్ అంతా సంతృప్తిగా ఉంది. ఆ విషయాన్ని మీడియాకు నిర్మాత స్వయంగా తెలిపారు. అయితే ఇటీవల సినిమా కథ మార్చాల్సిందిగా నాపై నిర్మాత ఒత్తిడి తెచ్చారు. అందుకు నేను అంగీకరించలేదు. దీంతో దర్శకుడిగా నన్ను తప్పించేందకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో నేను భాగస్వామిని, ప్రాఫిట్ హోల్డర్ను కూడా. ముంబైలో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాకు దర్శకత్వం వహించే హక్కులు పూర్తిగా నాకే ఉన్నాయి. ఈ సినిమా నుంచి నన్ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి నేను నిర్మాత ఎంఎల్వీ సత్యనారాయణపై కేసు వేశాను. ఈ నెల 30లోపు వివరణ ఇవ్వాల్సిందిగా నిర్మాతను కోర్టు ఆదేశించింది. నేను ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేశాను. మిగిలిన 30 శాతం షూటింగ్ నేను కాకుండా మరెవరైనా పూర్తి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని తెలిపారు.
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు