telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

సరైన ఆధారాలు లేవు.. శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్!

shekhar reddy ttd

నోట్ల రద్దు సమయంలో అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు రావడంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిపై నమోదు చేసిన కేసును చెన్నై సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఆయనతోపాటు మరో ఐదుగురిపై నమోదైన కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని కోర్టు స్పష్టం చేసింది. చెన్నైలోని శేఖర్ రెడ్డి నివాసంలో కొంతకాలం క్రితం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన తరువాత రూ. 12 లక్షల పాత కరెన్సీతో పాటు రూ. 8 కోట్ల కొత్త కరెన్సీ నోట్లు, భారీ ఎత్తున బంగారం లభించగా, కేసు నమోదైన సంగతి తెలిసిందే.

దాడుల తరువాత ఆయన ఇంట భారీ మొత్తంలో లభించిన డబ్బుపై సీబీఐ, ఈడీలు కూడా విచారణ జరిపాయి. శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు కోట్లాది రూపాయల పాత కరెన్సీని కొత్త కరెన్సీగా మార్చుకునే ప్రయత్నం చేశారని, ఇందుకు బ్యాంకుల సహకారం తీసుకున్నారని ఆరోపిస్తూ చార్జ్ షీట్ దాఖలైంది.

ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు, శేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారనడానికి సరైన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ అందించలేదని భావిస్తూ కేసును కొట్టివేసింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తానేమీ అక్రమంగా డబ్బులను తరలించలేదని, చట్ట విరుద్ధమైన లావాదేవీలు నడిపించలేదని, ఇప్పుడు కోర్టు కూడా అదే చెప్పిందని అన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని పన్నులను తాను చెల్లించానని పేర్కొన్నారు.

Related posts