వైసీపీ నేత వైఎస్ షర్మిళ నేటి ప్రచారంలో భాగంగా గుంటూరులో సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో రాజన్న బిడ్డను ఒక్కసారి గెలిపించండి, జగన్ ని సీఎం చేయండి అంటూ ప్రజలను కోరారు. జిల్లాలోని మాయాబజార్ సెంటర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే, జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఓటు వేసే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓసారి గుర్తు చేసుకోవాలని షర్మిళ సూచించారు.
చంద్రబాబుపై ఈ సందర్భంగా షర్మిళ విమర్శలు గుప్పించారు. అవతల పార్టీలో గెలుపొందిన వారిని తమ పార్టీలోకి చంద్రబాబు లాక్కున్నారని, ఇలాంటి రాజకీయ వ్యభిచారం జగన్ చేయలేదని, రాజకీయ విలువలకు ఆయన కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు. ప్రజలకు తాను ఉన్నానని భరోసా ఇస్తున్న రాజన్న బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా? ప్రజలకు ఇచ్చిన మాట తప్పని వాడు కావాలంటే, మడమ తిప్పని వాడు కావాలంటే జగన్ రావాలని కోరారు.