“అర్జున్ రెడ్డి” చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ షాలిని పాండే. మధ్యప్రదేశ్కు చెందిన షాలినీ పాండే.. జబల్పూర్లో రంగస్థల నటిగా కెరీర్ను మొదలుపెట్టింది. అక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు నేర్చుకుని ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. అంతేకాకుండా తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ‘అర్జున్ రెడ్డి’ తరవాత ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘118’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. సౌత్లో రాణిస్తోన్న షాలినీ పాండేపై బాలీవుడ్ కన్ను పడింది. ఇప్పటికే ‘మేరి నిమ్మో’ అనే చిన్న హిందీ సినిమాలో షాలినీ నటించింది. అయితే, ఇప్పుడు ఒక భారీ చిత్రంతో హిందీలో హీరోయిన్గా లాంచ్ అవుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోన్న చిత్రం ‘జయేష్ భాయ్ జోర్దార్’. మహిళా సాధికారత కోసం పోరాడే యువకుడి పాత్రలో రణ్వీర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్లుక్ కూడా విడుదలైంది. ఈ సినిమాలో షాలినీ పాండేను హీరోయిన్గా తీసుకున్నారు. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సరసన షాలినీ హీరోయిన్గా నటించనుంది. నిర్మాత మనీష్ శర్మ మాట్లాడుతూ “‘మా స్క్రిప్ట్, సినిమా విజన్ ప్రకారం ప్రధాన నటి పాత్రకు ఒక కొత్త ముఖం కావాలి. షాలినీని ఆడిషన్ చేసినప్పుడు ఆమె చురుకుదనం, నటన మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాత్రకు షాలినీ అయితేనే కరెక్ట్ అని మేం భావించాం. ఆమె ప్రతిభావంతురాలు. ఆమె నటనా ప్రతిభపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ‘జయేష్ భాయ్ జోర్దార్’లో ఆమె నటన మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది” అని మనీష్ చెప్పారు.
ఒక భారీ చిత్రం ద్వారా హీరోయిన్గా బాలీవుడ్లో అడుగుపెడుతుండటంపై షాలినీ మాట్లాడుతూ.. ‘‘యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో పనిచేయడం అనేది నిజంగా ప్రతి ఆర్టిస్ట్ కల. హిందీలో నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన యశ్ రాజ్ ఫిలింస్కి నా కృతజ్ఞతలు. అలాగే, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్ పక్కన నటించే అవకాశం రావడం నా అదృష్టం. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే విధంగా నన్ను నేను మలుచుకుంటా’’ అని చెప్పుకొచ్చింది.
అక్కా అక్కా అంటూనే తొక్కేసారు… బిగ్ బాస్ పై హేమ వ్యాఖ్యలు