కాలేజీల్లో ర్యాగింగ్ లేకుండా చేస్తామని ఏపీ హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ రోజు సచివాలయంలోని 2వ బ్లాక్ లో బాధ్యతలు చేపట్టిన ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఓ దళిత మహిళకు హోమ్ మంత్రిగా బాధ్యతలు ఇచ్చిన సీఎం జగన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఆడవాళ్లు భయం లేకుండా పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చే పరిస్థితి వచ్చేలా చూస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తేనున్నామని, నూతనంగా మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ను దశలవారీగా అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తామని తెలిపారు.