ప్రపంచ కప్ కోసం భారత జట్టు లండన్ లో పర్యటించిన వేళ, ఓ సీనియర్ క్రికెటర్, నిబంధనలను పక్కనబెట్టి, ఇష్టానుసారం వ్యవహరించాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రికెట్ మేనేజ్ మెంట్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ క్రికెటర్ టోర్నీ ఆసాంతం తన భార్యను వెంటేసుకునే తిరిగాడు. వాస్తవానికి ఆ క్రికెటర్ తన భార్యతో కలిసి వుండేందుకు అనుమతించాలని బీసీసీఐ పాలకుల కమిటీని కోరగా, మే 3న అతని కోరికను అధికారులు నిరాకరించారు.
టోర్నీ మధ్యలో 15 రోజుల పాటు మాత్రమే కుటుంబ సభ్యులతో కలిసివుండేందుకు అనుమతిస్తామని బీసీసీఐ చెప్పింది. అతను తన భార్యతోనే కలిసున్నాడని, తనతో పాటు తిప్పుకున్నాడని తెలుస్తోంది. ఎవరి అనుమతీ లేకుండా సదరు ఆటగాడు ఏడు వారాల పాటు తన భార్యతో కలిసి ఉంటే జట్టు మేనేజర్ ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఆ ఆటగాడు ఎవరన్న విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.