telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ .. మృతి..

senior choreographer srinu master died

చెన్నైలోని టి నగర్‌లో ఉన్న స్వగృహంలో టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్(82) కన్నుమూశారు. నేడు ఆయన గుండెపోటుతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన శ్రీను మాస్టర్ .. ‘నేనంటే నేనే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ‘చిలక కొట్టుడు కొడితే చిన్నదానా’ లాంటి హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసింది ఈయనే. ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి లాంటి టాప్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా శ్రీను మాస్టర్ పనిచేశారు. 70, 80లలో సినీ పరిశ్రమలో విజయవంతమైన కొరియోగ్రాఫర్‌గా ఆయనకు పేరుండేది. స్వర్ణకమలం, శ్రీరామరాజ్యం, రాధగోపాలం సినిమాలకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. శ్రీను మాస్టర్ జన్మస్థలం అధోని. తల్లిదండ్రులు లక్ష్మీ దేవమ్మ, నారాయణప్ప. 1956లో తన బావగారైన హీరాలాల్ మాస్టర్ దగ్గర శిష్యుడిగా పనిచేశారు.

తొలుత ఢిల్లీ రవీంద్రభారతిలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన గురుసుందర్ ప్రసాద్ వద్ద శ్రీను మాస్టర్ కథక్ నృత్యం అభ్యసించారు. ఆ తర్వాత విశ్వంగురు వద్ద కథాకళి సాధన చేశారు. సినిమా నృత్యాలను బావ హీరాలాల్ వద్ద ప్రాక్టీస్ చేశారు. 1969లో నిర్మాత డూండి రూపొందించిన ‘నేనంటే నేనే’ చిత్రంతో డాన్సు మాస్టర్‌గా శ్రీను సినిమాల్లోకి వచ్చారు. తరువాత ‘మహాబలుడు, భక్తకన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగపురుషుడు, యుగంధర్’ వంటి చిత్రాలకు నృత్య రీతులు సమకూర్చడంతో శ్రీను మాస్టర్ పేరు పరిశ్రమలో మార్మోగింది. ఏడెనిమిది భారతీయ భాషా చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. 1700 లకు చిత్రాలకు పైగా కొరియోగ్రఫీ పచేసిన ఆయనకు ‘స్వర్ణకమలం, రాధాగోపాలం, శ్రీరామరాజ్యం’ చిత్రాలకు గానూ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డులు వచ్చాయి.

Related posts