టాలీవుడ్ లో సీనియర్ నటి గీతాంజలి గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమె నటించారు. గీతాంజలి అసలు పేరు మణి. సహనటుడు రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు. నటిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి గీతాంజలి తన పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మా ఆయన రామకృష్ణగారు కూడా యాక్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరం సినిమా రంగానికి చెందినవారం కాబట్టి చాలా మంది మాది ప్రేమ వివాహం అనుకున్నారు. కానీ మాది పెద్దలు కుదిర్చిన వివాహం. రామకృష్ణగారు మా నాన్నను కాకా పట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు (నవ్వుతూ). రామకృష్ణగారి గుణగణాలు నచ్చడంతో `అబ్బాయి మంచి అందగాడు. డీసెంట్ బిహేవియర్` అని నాకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. మంచిరోజు, పెళ్ళిరోజు, తోటలోపిల్లా కోటలోరాణి, రాజయోగం, రణభేరి చిత్రాల్లో నేనూ, రామకృష్ణగారు కలిసి నటించాం” అన్నారు గీతాంజలి.
కాకినాడలో జన్మించిన గీతాంజలి.. మొదట హిందీలో పేయింగ్ గెస్ట్ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. గీతాంజలి సీతారామ కల్యాణం, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, దేవత, లేతమనసులు, తోడు-నీడ, గూఢచారి-116, ప్రాణమిత్రులు, పూలరంగడు, శ్రీకృష్ణావతారం, ఆదర్శకుటుంబం, రణభేరి, నిండు హృదయాలు, మంచిమిత్రులు, డాక్టర్ చక్రవర్తి, పెళ్లైన కొత్తలో, ఫూల్స్ తదితర చిత్రాల్లో నటించారు. చివరగా నాగార్జున నటించిన ‘భాయ్’ చిత్రంలో కనిపించిన గీతాంజలి.. తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మిలోనూ నటించారు. ఈ చిత్రం ఇంకా విడుదల అవ్వలేదు. ఇక వీరి కుమారుడు ‘భూమ’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. 1961లో తొలిసారిగా ఎన్టీఆర్ సీతారాముల కల్యాణం సినిమాలో సీత పాత్రలో నటించారు గీతాంజలి. నందినగర్ లోని నివాసానికి గీతాంజలి భౌతికకాయాన్ని తరలించారు. గీతాంజలి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.