సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, ధోనీ రిటైర్మెంట్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనిని దాటి తాము ఆలోచిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత మేం ఇక భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నామని స్పష్టంగా చెబుతున్నా. రిషబ్ పంత్ తో పాటు సంజు శాంసన్ ఎంపిక దీనికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను, కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేము భావిస్తున్నాం అని ఎమ్మెస్కే స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో ధోనీ రిటైర్మెంట్ సెలెక్టర్లు స్పష్టమైన ఆలోచనకు వచ్చినట్లు భావించవచ్చిన క్రీడా నిపుణులు చెబుతున్నారు. దాదా బీసీసీఐ చీఫ్ గా గంగూలీ ధోనీ రిటైర్మెంట్ విషయంపై మాట్లాడిన తర్వాత ఎమ్మెస్కే కూడా అదే విషయంపై వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
యువకులకు ఛాన్స్ ఇవ్వాలన్న తమ ఆలోచనకు మహి మద్దతు కూడా ఉందన్న ఎమ్మెస్కే, రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత నిర్ణయమని చెప్పడం విశేషం. ధోని భవిష్యత్తు గురించి కూడా మేం మాట్లాడాం. మహి మళ్లీ జట్టులోకి రావాలంటే అతడికి అడ్డేమీ లేదు. రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడా లేదా అనేది పూర్తిగా వ్యక్తిగతం. జట్టు భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక రూపొందించాం, దాని ప్రకారం ముందుకెళ్తాం. ఇందులో భాగంగానే మేము బంగ్లా టూర్ కు జట్టును ఎంపిక చేశాం అని పేర్కొన్నాడు. అటు వరల్డ్ కప్ తర్వాత బ్యాట్ పట్టని మహి జార్ఖండ్ అండర్-23 టీమ్తో కలిసి ప్రాక్టీస్ చేయనున్నట్లు తెలుస్తోంది.