ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను ప్రగతి భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల డిమాండ్లను టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ కిసాన్ సెల్ ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ ముట్టడి కార్యక్రమంలో ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా పాల్గొన్నారు. భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని సీతక్క డిమాండ్ చేశారు.
రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగలేదన్నారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్కను పోలీసులు అరెస్ట్ చేయడంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.