ఇటీవల శబరిమల స్వామిని దర్శించుకున్న ఇద్దరు మహిళలు అజ్ఞాతం వీడారు. వారికి భద్రతా కల్పించాలని కోర్టును వేడుకున్నారు. దీనికి స్పందించిన న్యాయస్థానం, ఆ ఇద్దరు మహిళలకు 24 గంటలూ భద్రతను కల్పించాలని ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం కనకదుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. దీంతో అయ్యప్ప సమితి ఆందోళనకారులు వారిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వాళ్లకు రక్షణ కల్పించాలని సుప్రీంలో ఓ పిటిషన్ వేశారు. దానిపై స్పందించిన కోర్టు.. ఆ ఇద్దరు మహిళలకు రౌండ్ ద క్లాక్ సెక్యూర్టీ కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ప్రభుత్వమే ఆ ఇద్దరు మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ స్పష్టం చేశారు. 50 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలు శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకోవచ్చు అని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ ఇద్దరు మహిళలు అక్కడకు వెళ్లారు. జనవరి 2వ తేదీన కేరళకు చెందిన ఆ ఇద్దరూ స్వామి వారిని దర్శించుకున్నారు.