ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కాస్త దాడుల వరకు వచ్చింది. ఇందులో భాగంగా తాజాగా.. కులం పేరుతో దూషించిన కేసు లో తాడిపత్రి ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్రైవర్ సుబ్బారాయుడును కులం పేరుతో దూషించాడని ఆయన తరఫున న్యాయవాది శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు జేసీ ఇంటి పై రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ పెద్దారెడ్డి ఇద్దరు కుమారులపై తాడిపత్రి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తాడిపత్రిలో రెండు రోజుల కిందట పెద్దారెడ్డి, జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తీవ్రంగా శ్రమించిన పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదైంది. దీనిపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.
రామ మందిర విరాళాల సేకరణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు…