స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బ్యాంకు ఖాతాల్లో కస్టమర్లు ఉంచాల్సిన కనీస నిల్వ మొత్తాన్ని తగ్గించింది. ఈ నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీనిప్రకారం పట్టణ ప్రాంతాల్లోని స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలో కనీసం రూ.3 వేల మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది. అలాగే సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారి ఖాతాల్లో కనీసం రూ.2,000 ఉంచాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల ఖాతాలో కనీసం రూ.వెయ్యి నిల్వ ఉండటం తప్పనిసరి అని తేల్చిచెప్పింది.
ఒకవేళ ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానాల వడ్డన తప్పదని స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నిల్వ రూ.1500 వరకు మాత్రమే ఉంటే రూ.10, రూ.750 వరకు వుంటే రూ.12.75, ఇంకా అంతకు తగ్గిపోతే కనుక రూ.15 పెనాల్టీ చెల్లించాలి. దీనికి జీఎస్టీ కూడా అదనమని బ్యాంకు తెలిపింది. ఇక సేవింగ్స్ ఖాతాలో నెలకు 3 సార్లు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది దాటితే అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుదని ఎస్బీఐ స్పష్టం చేసింది.