స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రుణాలపై వడ్డీ రేటును మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రేట్లు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇలా వడ్డీరేట్లు తగ్గించడం ఇది ఐదోసారి. ఏప్రిల్ 10 నుంచి ఇప్పటి వరకు 45 బేసిస్ పాయింట్లు మేర రుణ వడ్డీ భారం తగ్గింది. ఈనెల 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
ఈ నిర్ణయంతో ఏడాది కాలపరిమితి ఉన్న ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై ఇప్పటి వరకు 8.25 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా, ఇకపై 8.15 శాతం వసూలు చేస్తారు. అదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్లు తగ్గించింది. అన్ని కాలపరిమితులున్న రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పెద్దమొత్తంలో ఉన్న డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిస్ పాయింట్లు మేర తగ్గించింది. దీంతో ఏడాది నుంచి రెండేళ్ల కాపరిమితి ఉన్న డిపాజిట్లపై 6.7 శాతం వడ్డీ 6.5 శాతానికి తగ్గింది.