గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ను నియమించనున్నారు. ఈ మేరకు తమ మిత్రపక్షాలు ఎంజీఎఫ్, జీఎఫ్పీలతో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. నేటి సాయంత్రంలోపు సావంత్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో మనోహర్ పారికర్, మరో ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజాల మరణంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మరో ఎద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీనితో, సభలో ప్రస్తుతం 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 19 కాగా… 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ పరిస్థితులలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, వీలైనంత త్వరగా సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే బీజేపీ తీవ్రంగా కృషిచేసింది.