సీబీఐ తాజాగా పశ్చిమ బెంగాల్ లో వివిధ ప్రాంతాలలో దాడులకు పాల్పడింది. దీనితో కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేపట్టిన ‘సత్యాగ్రహ’ ధర్నా కొనసాగుతోంది. శారదా కుంభకోణం కేసులో కోల్కతా పోలీసు కమిషనర్ను ప్రశ్నించే నిమిత్తం సీబీఐ అధికారులు అనూహ్యంగా నిన్న సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ రాత్రికి రాత్రే దీక్షకు దిగారు.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేంతవరకు నేను ఈ సత్యాగ్రహాన్ని కొనసాగిస్తాను’ అని అన్నారు. ఈ ఉదయం భారీ సంఖ్యలో తృణమూల్ నేతలు, కార్యకర్తలు దీక్షా వేదిక వద్దకు చేరుకుని మమతాబెనర్జీకి మద్దతు పలికారు. మరోవైపు తాజా పరిణామాలపై సీబీఐ అధికారులు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
కోల్కతా పోలీస్ కమిషనర్ నివాసానికి నిన్న సాయంత్రం సీబీఐ అధికారులు చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పోలీసులు వెంటనే అప్రమత్తమై సీబీఐ అధికారులను కమిషనర్ నివాసం వెలుపలే అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. దీనితో కోల్కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.