telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

శరన్నవరాత్రులు : .. నేడు .. గాయత్రిదేవిగా .. అమ్మ..

sarannavaratrulu today as gayatri devi

మూడవరోజైన ఆశ్వయుజ శుద్ధ విదియనాడు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి అమ్మవారే అని అంటారు. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని వేదాలు చెపుతున్నాయి. ఈరోజు అమ్మవారు గాయిత్రి దేవిగా ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజోవంతము అవుతుంది. గాయత్రీ మంత్ర జపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి.

గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంతం మంత్ర శక్తి కలుగుతుంది. అశ్వయుజ శుద్ధ విదియ నాడు కనకదుర్గమ్మను శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణిగా గాయిత్రి దేవిని ఈరోజు సాధకులు ఆరాధిస్తారు. మన బుద్ధి శక్తులను ప్రచోదనం చేసి మన ఆలోచనలను విస్తృతం చేసే తల్లిగా గాయిత్రి దేవిని ఆరాధిస్తే మన బుద్ధికుసులత పెరుగుతుంది ఈ తల్లిని స్పూర్తిగా తీసుకుంటే ప్రతి మహిళా గుణవంతు రాలై తేజోవంతురాలై రాణిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అమ్మవారిని ఆరాధించడం అంటే కేవలం పూజా ద్రవ్యాలను సమర్పించి స్తోత్రాలను చేస్తే అమ్మ పలకదు. దేవీ తత్వాన్ని అర్ధం చేసుకుని సాటివారికి మానవత్వంతో సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే అమ్మ అనుగ్రహిస్తుంది.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజున దుర్గమ్మ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ”ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌” అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. అల్లపుగారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.

Related posts