పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్మాలిక్ను పెళ్లి చేసుకున్నందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఇబ్బందులు తప్పడం లేదు. భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగినా భారత నెటిజన్లు సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె పుల్వామా ఉగ్రదాడి ఘటన పై సోషల్ మీడియాలో స్పందించారు. ఫిబ్రవరీ 14 మన దేశానికి బ్లాక్ డే. ఇలాంటి రోజు మరొకటి చూడొద్దని కోరుకుంటున్నాని. ఈ రోజుని, జరిగిన ఘటనని అంత సులువుగా మర్చిపోలేమన్నారు.
కానీ ఇప్పటికీ ద్వేషం కంటే నేను శాంతిని కోరుకుంటున్నా. మేం సెలబ్రిటీలం కాబట్టి.. కొందరు వ్యక్తులు మాపై పనిగట్టుకొని విద్వేషాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం వారే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని గొంతు చించుకొని అరవాల్సిన అవసరం మాకు లేదు. ప్రతీ ఒక్కరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తారు. నేను నా దేశం కోసం ఆడుతాను, అందుకోసం నా చమట చిందిస్తాను. అలా నేను నా దేశానికి సేవ చేస్తున్నాను. సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు నేను అండగా నిలబడతాను. వాళ్లు ఈ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.