మలయాళ బ్యూటీ సాయి పల్లవి ‘ప్రేమమ్’తో సౌత్లో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ న్యాచురల్ బ్యూటీ. తర్వాత తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకోగల సామర్థ్యం ఈమె సొంతం. అందుకే సౌత్లో భారీ క్రేజ్ని సొంతం చేసుకోకలిగింది. ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టే ఈ హీరోయిన్ ఎప్పుడూ సెన్సేషన్స్కి కేరాఫ్ అవుతుంటోంది. తాజాగా సాయి పల్లవి కోటి రూపాయల ఆఫర్ని వదులుకొని వార్తల్లో నిలిచింది. ఓ పెద్ద కార్పోరేట్ సంస్థ తమ బట్టల ఉత్పత్తులకి బ్రాండ్ అంబాసిడర్గా ఈ హీరోయిన్ని నియమించు కోవాలనుకుంది. అందుకుగాను ఆ కార్పోరేట్ సంస్థ సాయి పల్లవికి అక్షరాలా కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. అయితే ఫిదా బ్యూటీ ఈ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.
బ్రాండింగ్లో సాయి పల్లవి ఇలా పెద్ద ఆఫర్స్ని వదులుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఈమెకి ప్రముఖ ఫేస్ క్రీమ్ యాడ్లో నటించేందుకు అవకాశం వచ్చింది. అప్పుడు కూడా సాయి పల్లవి రెండు కోట్ల ఆఫర్ను కాదనుకుందని వార్తలు వినిపించాయి. ఆ ఉత్పత్తులను వాడమని తాను చెప్పలేనని అందుకే యాడ్స్లో నటించనని ఈ హీరోయిన్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం పల్లవి తెలుగులో మంచి అవకాశాలతో దూసుకొనిపోతోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న `విరాటపర్వం’ చిత్రంలో ఈమె హీరోయిన్గా నటిస్తుంది. దీనితో పాటు నాగ చైతన్య హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రంలో కూడా ఈ రౌడీ బేబీ నటిస్తోంది. మరి కమిట్మెంట్ కోసం కోట్లు వదలుకుంటున్న ఈ బ్యూటీ రానున్న కాలంలో కూడా ఇదే మాట పై ఉంటుందేమో చూడాలి.