కేరళ రాష్ట్రంలోని శమరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆలయంలో మహిళల ప్రవేశంపై హిందుత్వవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలోని కేరళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెందిన ఓ హోటల్పై దాడి జరిగింది. థౌజండ్ నైట్లోని గ్రీమ్స్ రోడ్డులో గల హోటల్పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో హోటల్ అద్దాలు, సెక్యురిటీ చెక్పోస్టు ధ్వంసమయ్యాయి. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ సహా పలు హిందూ సంఘాలు గురువారం బంద్కు పిలుపునిచ్చాయి.
మరోవైపు గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ శ్రీశైలం హైవేపై అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు.శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి తుక్కుగూడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆపై కేరళ ప్రభుత్వం, హిందువుల వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మను దహనం చేశారు.