నేటి ఉదయం అధికారులు చడీచప్పుడు లేకుండా ఇద్దరు మహిళలను శబరిమల అయ్యప్ప దర్శనం చేయించిన విషయం తెలిసిందే. దీనితో ఆగ్రహించిన ఆలయ ప్రధాన అర్చకులు, సంప్రోక్షణ చేయాల్సిందిగా ఆదేశించారు. దీనితో ఆ కార్యక్రమం అనంతరమే భక్తులను ఆలయం లోకి అనుమతించారు. ఈ తెల్లవారుజామున ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో స్వామిని దర్శించుకున్న తరువాత తీవ్ర దుమారం చెలరేగగా గర్భాలయ తలుపులను మూసివేసిన ప్రధాన పూజారులు, సంప్రోక్షణ తరువాత, తలుపులను తిరిగి తెరిచారు.
ప్రధాన అర్చకుడి ఆదేశాలతో ఆలయాన్ని శుద్ధి చేసి, ఆపై భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని, ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, సంప్రోక్షణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, జరిగిన ఘటనలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పందల రాజ వంశీకులు, అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను మార్చేందుకు తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు.